ఐదవ స్తోత్రము 'కవికావ్యప్రశంసా' స్తోత్రము( 36 శ్లోకాలు)
మొదటి
శ్లోకము
ఆపన్నతాపహరణప్రవణా
ఘృణేవ త్వఙ్గత్తరఙ్గసుభగా గగనాపగేవ । పీయూషసారశిశిరా
శశభృత్కలేవ వాణీ శివైకశరణా జయతీశ్వరీవ ॥ 1 ॥
ప్రతిపదార్థము: ఆపన్న = ఆపదలో
ఉన్నవారి యొక్క, తాప = ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములను మూడు తాపములను, హరణ = పోగొట్టుటయందు,
ప్రవణా = ఆసక్తి కలదియు, శివ+ఏక+శరణా =
మంగళకరుడైన శివుడే ఏకైక ఆధారముగా కలదియు (మరియు శివుని యందే లీనమైనదియు) అయిన,
ఘృణా+ఇవ = కరుణ వలె, త్వఙ్గత్ = ఉల్లసిస్తున్న
(ఎగసిపడుతున్న), తరఙ్గ = తరంగములచేత, సుభగా
= అందమైనదియు, శివ+ఏక+శరణా = శివుని జటాజూటమే ఏకైక నివాసముగా
కలదియు అయిన, గగన+ఆపగా+ఇవ = ఆకాశగంగ (స్వర్గగంగ) వలె,
పీయూష = అమృతము యొక్క, సార = గడ్డకట్టిన మీగడ
వలె, శిశిరా = మిక్కిలి చల్లనైనదియు, శివ+ఏక+శరణా
= శివుని శిరస్సునే స్థానముగా కలదియు అయిన, శశభృత్+కలా+ఇవ =
చంద్రకల వలె, శివ+ఏక+శరణా = శివుడే ఏకైక గతిగా కలిగిన,
ఈశ్వరీ+ఇవ = పార్వతీదేవి వలె, (ఉన్నట్టి),
వాణీ = కవి యొక్క వాక్కు, జయతి =
సర్వోత్కృష్టముగా వర్ధిల్లుచున్నది.
తాత్పర్యము: దుఃఖితుల తాపములను
హరించే దయ వలె,
అలలతో మనోహరముగా ఉండే గంగానది వలె, అమృతము వలె
చల్లని చంద్రకల వలె, పరమశివుడినే ఆశ్రయించి ఉండే పార్వతీదేవి
వలె - కేవలము శివభక్తియే ఆధారముగా కలిగిన కవి వాక్కు సర్వోత్కృష్టమై
వెలుగొందుచున్నది.
విశేషములు:
- ఈ శ్లోకమునందు కవి వాక్కును నాలుగు ఉపమానములతో (దయ, గంగ,
చంద్రకల, పార్వతి) పోల్చుటచే ఇది మాలోపమాలంకారము.
- 'శివైకశరణా' అను పదము ప్రతి
ఉపమానమునకు అన్వయిస్తుంది. శివుని ఆశ్రయించిన వాక్కునకే ఈ పవిత్రత
సిద్ధిస్తుందని భావము.
రెండవ
శ్లోకము
యో
మూర్ధని స్రజమివోద్వహతే ధరిత్రీ- ముష్ణీషతాం శ్రయతి యస్య స
భోగిరాజః । యస్యామసౌ వసతి వాక్పతిరుక్తిదేవీం తాం యే వహన్తి హృది తే
కవయో జయన్తి ॥ 2 ॥
ప్రతిపదార్థము: యః = ఏ ఆదిశేషుడు, ధరిత్రీం =
ఏబది కోట్ల విస్తీర్ణము కలిగిన ఈ భూమిని, మూర్ధని = తన తల
పైన, స్రజం+ఇవ = పూలమాల వలె, ఉద్వహతే =
ఎటువంటి శ్రమ లేకుండా ధరించునో, సః = అట్టి, భోగిరాజః = పాముల రాజైన ఆదిశేషుడు, యస్య = ఏ
పరమశివునకు, ఉష్ణీషతాం = తలపాగా (శిరోవేష్టనము) వంటి
స్థితిని, శ్రయతి = పొందుచున్నాడో, అసౌ
= అట్టి ప్రసిద్ధుడైన, వాక్పతిః = పరా, పశ్యన్తీ, మధ్యమా, వైఖరీ అను
నాలుగు వాక్కులకు ప్రభువైన పరమాత్మ (శివుడు), యస్యాం = ఏ
వాగ్దేవి యందు (నిజశక్తి స్వరూపమైన వాక్కు నందు), వసతి =
అంతర్యామిగా ప్రకాశించునో, తాం = అట్టి, ఉక్తిదేవీం = వాగ్దేవిని, యే = ఏ పుణ్యాత్ములైన వారు,
హృది = తమ హృదయమునందు, వహన్తి = ధరిస్తారో,
తే = అట్టి, కవయో = నిపుణులైన కవులు, జయన్తి = సర్వోత్కృష్టముగా వెలుగొందుచున్నారు.
తాత్పర్యము: భూమండలాన్ని
పూలమాలలా మోసే ఆదిశేషుడు ఎవరికి తలపాగాగా ఉన్నాడో, ఆ వాక్పతియైన పరమశివుడు ఏ
వాక్కునందు నివసిస్తాడో, అట్టి దివ్యమైన వాక్కును హృదయమందు
ధరించే కవులే ధన్యులు, విజేతలు.
విశేషములు:
- కవి హృదయమునందు వాగ్దేవి ఉండటము అంటే కేవలము
పాండిత్యము మాత్రమే కాదు, ఆ వాక్కునందు పరమశివుడు 'నాద' స్వరూపముతో వెలుగవలెనని వ్యాఖ్యానము.
- శేషనాగు వంటి గొప్పవాడే శివుని సేవించుచున్నాడని
చెప్పబడింది.
మూడవ
శ్లోకము
ధన్యాః
శుచీని సురభీణి గుణోమ్భితాని వాగ్వీరుధః స్వవదనోపవనోద్గతాయాః । ఉచ్చిత్య
సూక్తికుసుమాని సతాం వివిక్త- వర్ణాని కర్ణపులినేష్వవతంసయన్తి ॥ 3 ॥
ప్రతిపదార్థము: ధన్యాః = గొప్ప
భాగ్యవంతులైన కవులు, స్వ+వదన+ఉపవన = తన ముఖము అనెడి
ఉద్యానవనము నుండి, ఉద్గతాయాః = పుట్టినట్టి, వాక్+వీరుధః = వాక్కు అనెడి లత నుండి, శుచీని = దోషరహితములై పవిత్రమైనట్టివియు, సురభీణి =
శివభక్తి రసమనే సువాసన గలవియు, గుణ+ఉమ్భితాని = మాధుర్య,
ఓజస్సు, ప్రసాదము అను గుణములతో కూర్చబడినవియు
(పక్షమున దారములతో గ్రుచ్చబడినవి), వివిక్త+వర్ణాని =
స్పష్టమైన అక్షరములు కలిగినట్టివియు (పక్షమున స్వచ్ఛమైన రంగులు గలవి), సూక్తి+కుసుమాని = మంచి మాటలు అనెడి పూలను, ఉచ్చిత్య = కోసి (సేకరించి), సతాం = పండితులైన
సహృదయుల యొక్క, కర్ణ+పులినేషు = చెవులు అనే ఇసుక తిన్నెల
యందు (చెవుల దగ్గర), అవతంసయన్తి = కర్ణభూషణములుగా
(అలంకారములుగా) అలంకరించుచున్నారు.
తాత్పర్యము: ధన్యులైన కవులు తమ
ముఖమనే తోటలో పెరిగిన వాక్కు అనే తీగ నుండి, పవిత్రమైనవి, గుణయుక్తమైనవి,
మనోహరమైన వర్ణములతో కూడినవి అయిన సూక్తి కుసుమాలను కోసి, విజ్ఞులైన వారి చెవులకు అలంకారాలుగా సమర్పిస్తారు.
విశేషములు:
- ఇక్కడ రూపక అలంకారము వాడబడింది. ముఖము - ఉపవనముగా, వాక్కు
- తీగగా, సూక్తులు - పువ్వులుగా వర్ణించబడినవి.
- 'కర్ణపులినేషు' అనగా పండితుల చెవుల
తీరమున ఆ కవిత్వము నిలిచిపోతుందని అర్థము.
నాలుగవ శ్లోకము
శ్రోత్రాణ్యనర్గలగలన్మధుబిన్దుగర్భ- సందర్భసున్దరపదోపచితైర్వచోభిః
। ధన్యాః సతాం సుకవయః సుఖయన్తి తేఽపి తేషామకృత్రిమచమత్కృతిసాధువాదైః
॥ 4 ॥
ప్రతిపదార్థము: ధన్యాః =
భాగ్యవంతులైన, సుకవయః = మహాకవులు, అనర్గల = అడ్డులేకుండగా
(నిరంతరముగా), గలత్ = జారుతున్న, మధు+బిన్దు
= తేనె చుక్కలను, గర్భ = లోపల కలిగిన, సందర్భ
= కూర్పు గల (ప్రబంధము గల), సున్దర = రమ్యమైనట్టియు, నిర్దోషమైనట్టియు, పద+ఉపచితైః = పదములతో కూర్చబడిన,
వచోభిః = సూక్తులచేత, సతాం = పండితులైన
సహృదయుల యొక్క, శ్రోత్రాణి = చెవులను, సుఖయన్తి
= ఆనందింపజేయుచున్నారు, తే+అపి = ఆ పండితులు కూడా, అకృత్రిమ = సహజమైన, చమత్కృతి = చమత్కారముతో కూడిన,
సాధువాదైః = "శభాష్" అను మెచ్చుకోలు మాటలచేత, తేషాం = ఆ కవుల యొక్క (చెవులను), సుఖయన్తి =
సంతోషపెట్టుచున్నారు.
తాత్పర్యము: నిరంతరము తేనె
చినుకులు కురుస్తున్నట్లుండే నిర్దోషమైన పదబంధాలతో మహాకవులు పండితుల చెవులకు విందు
చేస్తారు. దానికి ప్రతిగా ఆ పండితులు కూడా కృత్రిమత్వం లేని సహజమైన ప్రశంసలతో ఆ
కవులను ఆనందింపజేస్తారు. ఇక్కడ కవులు, పండితులు ఒకరినొకరు గౌరవించుకుంటూ
ఆనందాన్ని పొందుతారని భావము.
విశేషములు:
- 'మధు' అనగా ఇక్కడ పుష్పరసము (తేనె)
అని అర్థము. కవిత్వములోని మాధుర్యమును తేనెతో పోల్చుట ఇక్కడి విశేషము.
- కవికి లభించే అతిపెద్ద బహుమతి సహృదయుడైన పండితుని
మెచ్చుకోలు.
ఐదవ
శ్లోకము
తే
కేచిదస్ఖలితబన్ధనవప్రబన్ధ- సంధానబన్ధురగిరః కవయో జయన్తి । యేషామచర్వితరసాపి
చమత్కరోతి కర్ణే కృతైవ భణితిర్మధురా సుధేవ ॥ 5 ॥
ప్రతిపదార్థము: అస్ఖలిత = తప్పులు
లేని (ధారాళమైన), బన్ధ = క్రమము మరియు రచన కలిగిన, నవ =
అపూర్వమైన, ప్రబన్ధ = సాహిత్య రచనల యొక్క, సంధాన = కూర్పు నందు, బన్ధుర = మనోహరమైన, గిరః = వాక్కులు కలిగిన, తే = అట్టి, కేచిత్ = కొందరు (శ్రేష్ఠులైన), కవయో = కవులు,
జయన్తి = సర్వోత్కృష్టముగా వెలుగొందుచున్నారు, యేషాం = ఎవరి యొక్క, మధురా = తియ్యనైన, భణితిః = మాట (రచన), సుధా+ఇవ = అమృతము వలె, అచర్విత+రసా+అపి = పూర్తిగా రసము ఆస్వాదించబడక ముందే (వినగానే), కర్ణే = చెవిలో, కృతా+ఏవ = వేయబడగానే (వినబడగానే),
చమత్కరోతి = ఆశ్చర్యమును, ఆనందమును
కలిగిస్తుందో.
తాత్పర్యము: ఎవరి కవిత్వము
అమృతము వలె చెవిన పడగానే ఆనందాన్ని ఇస్తుందో, ఎవరి రచనలు అపూర్వముగా, దోషరహితముగా ఉండి మనోహరముగా ఉంటాయో, అట్టి కొందరు
మహాకవులు లోకమున అత్యంత గొప్పగా ప్రకాశిస్తారు.
విశేషములు:
- అమృతము నాలుకపై పడగానే ఎలా ఆనందాన్ని ఇస్తుందో, మహాకవుల
కవిత్వము కూడా దాని అర్థమును పూర్తిగా మథించక ముందే వినగానే మనసును
రంజింపజేస్తుందని ఇక్కడి భావము.
ఆరవ శ్లోకము
తేఽనన్తవాఙ్మయమహార్ణవదృష్టపారాః సాంయాత్రికా
ఇవ మహాకవయో జయన్తి । యత్సూక్తిపేలవలవఙ్గలవైరవైమి సన్తః సదఃసు
వదనాన్యధివాసయన్తి ॥ 6 ॥
ప్రతిపదార్థము: అనన్త = అంతులేని, వాఙ్మయ =
చతుర్దశ విద్యా స్వరూపమైన సాహిత్యమనే, మహార్ణవ = మహా
సముద్రము యొక్క, దృష్ట + పారాః = అవతలి గట్టును చూసిన
(చివరను పొందిన), తే = ఆ, మహాకవయః =
మహాకవులు, సాంయాత్రికాః + ఇవ = ఓడల మీద ప్రయాణించే వర్తకుల
వలె, జయన్తి = సర్వోత్కృష్టముగా వెలుగొందుచున్నారు, సన్తః = సజ్జనులైన పండితులు, సదఃసు = సభల యందు,
యేషాం (యత్) = ఎవరి యొక్క, సూక్తి = మంచి
మాటలనే, పేలవ = కోమలమైన, లవఙ్గ + లవైః
+ ఇవ = లవంగము ముక్కల చేత వలె, వదనాన్ని = తమ ముఖములను,
అధివాసయన్తి = సువాసన భరితముగా (చమత్కారముతో) చేసుకుంటున్నారని,
అవైమి = తలంచుచున్నాను.
తాత్పర్యము: అనంతమైన సాహిత్యమనే
మహాసముద్రాన్ని దాటిన మహాకవులు ఓడ ప్రయాణీకులైన వర్తకుల వంటివారు. సముద్ర ప్రయాణము
చేసే వర్తకులు లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలను తెచ్చినట్లు, ఈ మహాకవులు
తమ సూక్తులను అందిస్తారు. పండితులు సభలలో ఆ కోమలమైన సూక్తులను ఉచ్చరిస్తూ, లవంగము ముక్కలను చప్పరించినట్లు తమ ముఖములను పవిత్రము, సుగంధ భరితము చేసుకుంటారు.
విశేషములు:
- లవంగము, జాపత్రి వంటివి తింటే మతిజాడ్యము పోయి
నోరు సువాసన వస్తుందని ఆయుర్వేదము చెబుతుంది. అలాగే మహాకవుల సూక్తులు విన్నా,
చదివినా పండితుల మతి ప్రకాశిస్తుందని ఇక్కడ భావము.
- 'వాఙ్మయమహార్ణవ' అనుటలో రూపక
అలంకారము, కవులను వర్తకులతో పోల్చుటలో ఉపమాలంకారము
కలవు.
ఏడవ శ్లోకము
జిహ్వాగ్రరఙ్గభువి
సత్కవితుర్విలాస- లాస్యోత్సవవ్యసనినీ స్వయముక్తిదేవీ ।
భ్రూకాణ్డకుణ్డలకిరీటశిరోధరాణాం నృత్తోపదేశగురుతాం కృతినాముపైతి ॥ 7 ॥
ప్రతిపదార్థము: ఉక్తిదేవీ =
వాగ్దేవి, సత్కవితుః = మహాకవి యొక్క, జిహ్వా + అగ్ర = నాలుక
చివర అనేడి, రఙ్గభువి = నాట్య రంగస్థలము నందు, స్వయమేవ = స్వయముగా, విలాస = విలాసములతో కూడిన,
లాస్య = నృత్యము యొక్క, ఉత్సవ = పండుగ యందు,
వ్యసనినీ = ఆసక్తి కలదై, కృతినాం =
బుద్ధిమంతులైన సహృదయుల యొక్క, భ్రూకాణ్డ = కనుబొమ్మలు,
కుణ్డల = చెవి కుండలములు, కిరీట = కిరీటము,
శిరోధరాణాం = మెడ మొదలైన అవయవములకు, నృత్త +
ఉపదేశ + గురుతాం = నాట్య శిక్షణ ఇచ్చే గురువు యొక్క స్థితిని, ఉపైతి = పొందుచున్నది.
తాత్పర్యము: మహాకవి నాలుక చివర
వాగ్దేవి స్వయంగా నాట్యము చేస్తుంది. ఆ కవిత్వములోని ప్రౌఢిమను, చమత్కారాన్ని
వింటున్నప్పుడు, పండితులు తమకు తెలియకుండానే ఆనందంతో తలలు
ఊపుతారు. ఆ తల ఊపుల వల్ల వారి కనుబొమ్మలు, కుండలాలు, కిరీటాలు కూడా కదులుతాయి. ఆ కదలికలను చూస్తుంటే వాగ్దేవియే వారికి నాట్యము
నేర్పుతున్న గురువులా కనిపిస్తుందని భావము.
విశేషములు:
- "పరస్య హృదయే లగ్నం న ఘూర్ణయతి యచ్ఛిరః" అని
త్రివిక్రమ భట్టు చెప్పినట్లు, హృదయానికి హత్తుకున్న
కవిత్వము విన్నప్పుడు తల ఊపడం సహజ లక్షణము. ఆ స్థితిని ఇక్కడ అద్భుతముగా
వర్ణించారు.
ఎనిమిదవ
శ్లోకము
ఆవర్జయన్తి
మఠరాఞ్జఠరార్థమాత్ర- పాత్రీకృతార్థకణికా గణికావిటాద్యాః ।
ప్రౌఢాన్పునర్భుజగభూషణభక్తిసిక్త- సూక్తావలీవిరచనాచతురాః కవీన్ద్రాః ॥ 8 ॥
ప్రతిపదార్థము: జఠర + అర్థ + మాత్ర
= కేవలము కడుపు నింపుకొనుట కోసమే, పాత్రీకృత = సంపాదించిన (లేదా వ్యర్థము
చేసిన), అర్థ + కణికాః = కొద్దిపాటి ధనము గల (లేదా చమత్కారపు
మాటలు గల), గణికా + విట + ఆద్యాః = వేశ్యలు, విటులు మొదలైనవారు, మఠరాన్ = మూర్ఖులను, ఆవర్జయన్తి = వశీకరించుకుంటారు, పునః = కానీ,
భుజగ + భూషణ = పాములను ఆభరణములుగా కలిగిన పరమశివుని యందలి, భక్తి = భక్తి రసముతో, సిక్త = తడిసిన (నిండిన),
సూక్త + ఆవలీ = మంచి మాటల సమూహమును, విరచనా =
కూర్చుట యందు, చతురాః = నేర్పరులైన, కవీన్ద్రాః
= కవి శ్రేష్ఠులు, ప్రౌఢాన్ = మేధావవులైన పండితులను, ఆవర్జయన్తి = ఆకట్టుకుంటారు.
తాత్పర్యము: లోకంలో వేశ్యలు, విటులు
కేవలం పొట్టకూటి కోసం చేసే మాటలతో మూర్ఖులను లోబరుచుకుంటారు. కానీ శివభక్తితో
నిండిన కావ్యాన్ని రచించే మహాకవులు మాత్రం, తమ
వాక్చాతుర్యంతో లోకంలోని మేధావులను, పండితులను మెప్పిస్తారు.
విశేషములు:
- సామాన్యమైన లౌకిక వాక్కుకు, శివభక్తి
రసంతో కూడిన మహాకవి వాక్కుకు గల వ్యత్యాసాన్ని ఇక్కడ స్పష్టము చేశారు.
- 'మఠర' అనేది మూర్ఖుడిని సూచించే రూఢి
పదము.
తొమ్మిదవ శ్లోకము
ధన్యః
స కోఽపి సుకవిః కవికర్మ కృత్త- లోకార్తి కార్తికతుషారకరానుకారి । గాయన్తి
యస్య కృతినస్త్రిజగత్పవిత్రం చిత్రం చరిత్రమివ బాలమృగాఙ్కమౌలేః ॥ 9 ॥
ప్రతిపదార్థము: కృత్త + లోక +
ఆర్తి = ప్రజల యొక్క మనోదుఃఖములను ఛేదించునట్టిదియు, కార్తిక + తుషారకర + అనుకారి =
కార్తిక పౌర్ణమి నాటి చంద్రుని పోలినదియు, త్రిజగత్ +
పవిత్రం = మూడు లోకములను పవిత్రము చేయునట్టిదియునైన, యస్య =
ఏ కవి యొక్క, కవికర్మ = కావ్యమును (కవిత్వమును), కృతినః = పండితులు, బాల + మృగాఙ్క + మౌలేః =
బాలచంద్రుని శిరస్సున ధరించిన శివుని యొక్క, చిత్రం =
ఆశ్చర్యకరమైన, చరిత్రం + ఇవ = చరిత్ర వలె, గాయన్తి = గానము చేయుదురో (కీర్తింతురో), సః + కః +
అపి = అట్టి ఎక్కడో ఒకరు ఉండే, సుకవిః = మహాకవి, ధన్యః = భాగ్యవంతుడు.
తాత్పర్యము: కార్తిక మాసపు
నిండు చంద్రుని వలె ఆహ్లాదాన్ని ఇస్తూ, లోకుల కష్టాలను పోగొట్టే కావ్యమును ఏ
మహాకవి రచిస్తాడో అతడే ధన్యుడు. శివుని దివ్య చరిత్రను భక్తులు ఎలా కీర్తిస్తారో,
పండితులు కూడా ఆ కవి యొక్క కావ్యాన్ని అంతటి పవిత్ర భావంతో లోకమంతటా
గానం చేస్తారు.
విశేషములు:
- కార్తిక చంద్రుని కాంతి ఎలాగైతే కంటికి చల్లదనము, మనసుకి
హాయిని ఇస్తుందో, సత్కవి కవిత్వము కూడా పాఠకుల తాపాన్ని
పోగొడుతుందని ఇక్కడ పోలిక.
- కవికర్మను (కావ్యాన్ని) శివుని చరిత్రతో పోల్చడం
ద్వారా ఆ కవిత్వము యొక్క పవిత్రతను చాటిచెప్పారు.
పదవ
శ్లోకము
త్రైలోక్యభూషణమణిర్గుణివర్గబన్ధు- రేకశ్చకాస్తి
సవితా కవితా ద్వితీయః । శంసన్తి యస్య మహిమాతిశయం శిరోభిః పాదగ్రహం
విదధతః పృథివీభృతోఽపి ॥ 10 ॥
ప్రతిపదార్థము: త్రైలోక్య + భూషణ +
మణిః = మూడు లోకములకు అలంకారమైన మణి వంటివాడును, గుణి + వర్గ + బన్ధుః =
సద్గుణములు (లేదా కిరణములు) కలవారికి బంధువును అయిన, సవితా =
సూర్యుడు, ఏకః = ఒక్కడిగా (ఆకాశమున), చకాస్తి
= ప్రకాశించుచున్నాడు; (అట్లే) కవితా = కవిత్వము (లేదా కవి),
ద్వితీయః = రెండవవాడిగా (భూమిపై ప్రకాశించుచున్నాడు), పృథివీభృతః + అపి = పర్వతములు సైతము (పక్షమున రాజులు సైతము), యస్య = ఏ సూర్యుని యొక్క (లేదా కవి యొక్క), పాద +
గ్రహం = కిరణముల స్పర్శను (పక్షమున చరణములను ఆశ్రయించుటను), విదధతః
= చేయుచున్నవారై, శిరోభిః = తమ శిఖరములతో (పక్షమున తలలతో),
మహిమ + అతిశయం = గొప్పతనమును, శంసన్తి =
కొనియాడుచున్నారు.
తాత్పర్యము: లోకమున సూర్యుడు
ఒక్కడే వెలుగునిచ్చేవాడు. ఆయనకు సాటిరాగల రెండవ వాడు కవి మాత్రమే. సూర్యుని
కిరణాలు సోకగానే పర్వత శిఖరాలు ఎలాగైతే వెలిగిపోతూ ఆయన గొప్పదనాన్ని చాటుతాయో, అలాగే
మహాకవి పాదాలను ఆశ్రయించి (అతని కవిత్వమును చదివి) గొప్ప రాజులు కూడా తమ తలలు వంచి
ఆ కవి మహిమను కొనియాడుతారు.
విశేషములు:
- ఇక్కడ 'పాద' (కిరణము/కాలు)
మరియు 'పృథివీభృత్' (పర్వతము/రాజు)
పదములలో శ్లేష అలంకారము వాడబడింది.
- సూర్యుడు ఆకాశానికి అలంకారమైతే, కవి ఈ
లోకానికి అలంకారమని భావము.
పదకొండవ
శ్లోకము
యస్య
స్త్రవన్త్యమృతమేవ ముఖే తుషార- హారాభిరామరుచిరఞ్చితవక్రభఙ్గిః । సూక్తిర్ద్యుసిన్ధురివ
మూర్ధ్ని హరస్య చన్ద్ర- లేఖేవ వా వసతి తం సుకవిం నమామః ॥ 11 ॥
ప్రతిపదార్థము: యస్య = ఏ కవి యొక్క, ముఖే =
ముఖమునందు, తుషార = మంచు వలెను, హార =
ముత్యాల హారము వలెను, అభిరామ = మనోహరమైన, రుచిః = కాంతి కలిగి, అఞ్చిత = ఒప్పియున్న, వక్ర + భఙ్గిః = చమత్కారమైన నడక (పక్షమున వంకరలు) కలిగినదై, అమృతం + ఏవ = అమృతమునే (పక్షమున నీటినే), స్త్రవన్తీ
= కురిపించునట్టి, సూక్తిః = సూక్తి (మంచి మాట), హరస్య = శివుని యొక్క, మూర్ధ్ని = శిరస్సునందు,
ద్యుసిన్ధుః + ఇవ = గంగానది వలె, వా = లేదా,
చన్ద్ర + లేఖా + ఇవ = చంద్రకల వలె, వసతి =
నివసించునో, తం = అట్టి, సుకవిం =
మహాకవిని, నమామః = నమస్కరించుచున్నాము.
తాత్పర్యము: శివుని శిరస్సుపై
గంగానది, చంద్రకల ఎలాగైతే పవిత్రముగా, సుందరముగా ఉంటాయో,
అలాగే ఏ మహాకవి ముఖమునందు చమత్కారముతో కూడిన సూక్తులు నిరంతరము
అమృతాన్ని కురిపిస్తుంటాయో, అట్టి మహాకవికి మేము
నమస్కరిస్తున్నాము.
విశేషములు:
- కవి సూక్తిని గంగతోను, చంద్రకలతోను పోల్చడము
అత్యంత రమణీయము. గంగ నీటిని (అమృతాన్ని) ఇస్తుంది, చంద్రకల
సుధను (అమృతాన్ని) కురిపిస్తుంది, కవిత్వము రసామృతాన్ని
ఇస్తుంది.
- 'వక్రభఙ్గి' అనగా కవిత్వము నందు
వక్రోక్తి (చమత్కారము), గంగ యందు అలల వంకర నడక, చంద్రుని యందు నెలవంక రూపము అని అర్థము.
పన్నెండవ శ్లోకము
యాతా
గుణైరుపచయం విమలా ప్రకృత్యా నైసర్గికీం పరిణతిం ప్రథమాం వహన్తీ ।
బుద్ధిః సతాం శశికలాముకుటప్రసాదా- ద్వాణీ చ న క్వచిదపి ప్రతిఘాతమేతి ॥ 12 ॥
ప్రతిపదార్థము: శశికలా + ముకుట +
ప్రసాదాత్ = చంద్రకళను కిరీటముగా ధరించిన శివుని అనుగ్రహము వలన, సతాం =
సత్కవుల యొక్క, బుద్ధిః = బుద్ధియు, వాణీ
+ చ = వాక్కును, గుణైః = నైపుణ్యము, గాంభీర్యము,
కోమలత్వము మొదలైన గుణములచేత (వాక్కు పరముగా మాధుర్య, ఓజ, ప్రసాద గుణములచేత), ఉపచయం
= వృద్ధిని (పరిపూర్ణత్వమును), యాతా = పొందినదై, ప్రకృత్యా = స్వభావముచేత, విమలా = నిర్మలమైనదై
(దోషరహితమైనదై), నైసర్గికీం = సహజమైన, ప్రథమాం
= శ్రేష్ఠమైన, పరిణతిం = ప్రౌఢత్వమును (పరిపాకమును), వహన్తీ = ధరించుచున్నదై, క్వచిత్ + అపి = ఎక్కడను,
ప్రతిఘాతం = ఆటంకమును, న + ఏతి = పొందదు.
తాత్పర్యము: చంద్రమౌళియైన
పరమశివుని అనుగ్రహము ఉంటే, మహాకవుల బుద్ధి మరియు వాక్కు ఉత్తమ గుణాలతో పరిపూర్ణమై,
స్వభావసిద్ధమైన నిర్మలత్వాన్ని పొందుతాయి. అట్టి ప్రౌఢమైన వాక్కుకు
గానీ, బుద్ధికి గానీ ఎక్కడా ఎటువంటి ఆటంకము ఎదురుకాదు.
విశేషములు:
- ఈ శ్లోకమునందు సాంఖ్య దర్శనములోని 'ప్రకృతి-బుద్ధి'
తత్వముల పరముగా కూడా అర్థము స్ఫురిస్తుంది. ప్రకృతి యొక్క
మొదటి పరిణామమే బుద్ధి అని సాంఖ్యము చెబుతుంది.
- శివ ప్రసాదము వలన కవికి అప్రతిహతమైన వాక్శుద్ధి
కలుగుతుందని భావము.
పదమూడవ
శ్లోకము
చన్ద్రావచూడచరణస్మరణప్రసాద- సందర్భనిర్భరగభీరగిరాం
కవీనామ్ । సూక్తిర్బిభర్తి ముఖపఙ్కజరఙ్గనృత్య- ద్వాగ్దేవతాకనకనూపురనాదలీలామ్
॥ 13 ॥
ప్రతిపదార్థము: చన్ద్రావచూడ =
శివుని యొక్క, చరణ + స్మరణ = పాదములను ధ్యానించుట వలన కలిగిన, ప్రసాద
= అనుగ్రహము యొక్క, సందర్భ = కూర్పుచేత, నిర్భర = నిండినట్టియు, గభీర = గంభీరమైనట్టియు,
గిరాం = వాక్కులు కలిగిన, కవీనామ్ = కవుల
యొక్క, సూక్తిః = సూక్తి, ముఖ + పఙ్కజ
= ముఖమనే పద్మము అనెడి, రఙ్గ =
నాట్యరంగమున, నృత్యత్ = నాట్యము చేయుచున్న, వాగ్దేవతా = సరస్వతీ దేవి యొక్క, కనక + నూపుర =
బంగారు అందెల (మంజీరముల), నాద + లీలామ్ = ధ్వని యొక్క
విలాసమును, బిభర్తి = ధరించుచున్నది.
తాత్పర్యము: శివుని పాదస్మరణతో
పవిత్రులై గంభీరమైన వాక్కులు పలికే మహాకవుల సూక్తులు ఎలా ఉంటాయంటే - వారి ముఖమనే
పద్మముపై వాగ్దేవి నాట్యము చేస్తుంటే, ఆమె బంగారు అందెల నుండి వచ్చే మధురమైన
ధ్వని వలె ఆ సూక్తులు అతి మనోహరముగా వినబడతాయి.
విశేషములు:
- 'ముఖపఙ్కజరఙ్గ' అనుటలో రూపక అలంకారము
కలదు. కవిత్వములోని శబ్ద మాధుర్యమును సరస్వతీ దేవి అందెల రవళితో పోల్చడము
అత్యంత శోభాయమానము.
పదునాల్గవ
శ్లోకము
కావ్యం
విభావ్య నిజమర్ధనిమీలితాని నైసర్గికం జహతి చాపలమీక్షణాని । గృహ్ణన్తి
తన్మసృణతాం సహజాం విహాయ భ్రూవల్లయస్తు కృతినాం కవిపుంగవానామ్ ॥ 14 ॥
ప్రతిపదార్థము: కృతినాం =
పుణ్యాత్ములైన,
కవి + పుంగవానామ్ = శ్రేష్ఠులైన కవులు, నిజం =
తమదైన (శివభక్తితో కూడిన), కావ్యం = కావ్యమును, విభావ్య = ఆలోచించి (ఆస్వాదించి), అర్ధ + నిమీలితాని
= సగము మూయబడినవై, నైసర్గికం = స్వభావసిద్ధమైన, చాపలమ్ = చంచలత్వమును, జహతి = విడుచుచున్నవి,
భ్రూవల్లయః + తు = వారి కనుబొమ్మల తీగలు మాత్రము, సహజాం = సహజమైన, మసృణతాం = మందకొడితనమును
(నిశ్చలత్వమును), విహాయ = విడిచి, తత్
= ఆ (కన్నులు వదిలిన), చాపలమ్ = చంచలత్వమును (నృత్యమును),
గృహ్ణన్తి = గ్రహించుచున్నవి.
తాత్పర్యము: మహాకవులు తాము
రచించిన శివస్తోత్ర కావ్యమును తామే ధ్యానిస్తున్నప్పుడు, ఆ
రసాస్వాదనలో పరవశించి వారి కళ్లు సగము మూతపడి నిశ్చలమైపోతాయి. కానీ ఆ ఆనంద
పరవశత్వము వల్ల వారి కనుబొమ్మలు మాత్రం నిశ్చలతను వీడి చంచలముగా నాట్యము చేస్తూ ఆ
అంతరంగిక ఆనందాన్ని బయటపెడతాయి.
విశేషములు:
- కావ్య రసాస్వాదనలో కలిగే సాత్విక వికారములను ఇక్కడ కవి
చక్కగా వర్ణించారు. కళ్లు చలించకపోయినా, కనుబొమ్మలు కదలడము అనేది పరమానంద
స్థితికి సంకేతము.
పదిహేనవ
శ్లోకము
నీహారహారధవలస్య
జయత్యపూర్వః పాకః స కోఽపి సుకృతస్య కృతస్య పూర్వమ్ । యః
సంప్రతి ప్రతిఫలత్యమలాసు బాల- చన్ద్రావచూలనుతిసూక్తిషు సత్కవీనామ్ ॥ 15 ॥
ప్రతిపదార్థము: నీహార = మంచు వలెను, హార =
ముత్యాల హారము వలెను, ధవలస్య = తెల్లనైన (నిర్మలమైన),
పూర్వమ్ = పూర్వజన్మల యందు, కృతస్య = చేయబడిన,
సుకృతస్య = పుణ్యము యొక్క, సః + కః + అపి =
అట్టి ఏదో ఒక, అపూర్వః = విలక్షణమైన, పాకః
= పరిపాకము (ఫలము), జయతి = సర్వోత్కృష్టముగా
వెలుగొందుచున్నది, యః = ఏ పుణ్యఫలము, సంప్రతి
= ఇప్పుడు, సత్కవీనామ్ = మహాకవుల యొక్క, అమలాసు = నిర్మలమైన, బాల + చన్ద్రావచూల + నుతి +
సూక్తిషు = బాలచంద్రుడిని శిరస్సున ధరించిన శివుని స్తోత్ర రూపమైన సూక్తుల యందు,
ప్రతిఫలతి = ప్రతిబింబించుచున్నదో.
తాత్పర్యము: మహాకవులకు
పరమశివుని స్తుతించే అదృష్టము కలగడము అనేది సామాన్యమైన విషయము కాదు. పూర్వజన్మలలో
వారు చేసుకున్న అత్యంత పవిత్రమైన, నిర్మలమైన పుణ్యమే ఇప్పుడు ఈ జన్మలో
శివస్తోత్ర రూపమైన వాక్కులుగా వారిలో ప్రతిబింబిస్తున్నది. అట్టి పుణ్యపరిపాకమే
అన్నింటికన్నా గొప్పది.
విశేషములు:
- భగవంతుని స్తుతించాలనే బుద్ధి కలగడమే గొప్ప పుణ్యఫలమని, అది
అనేక జన్మల తపస్సు వల్ల సిద్ధించే 'పాకము' అని కవి ఇక్కడ ఉద్ఘాటించారు.
పదహారవ
శ్లోకము
సూక్ష్మార్థదర్శనవిమర్శవశప్రరూఢ- భ్రూకాణ్డతాణ్డవనివేదితచిద్వికాసమ్
। ఆస్వాద్య యత్సుమతయో ముఖముద్వహన్తి సూక్తామృతం జయతి
తత్కవికుఞ్జరాణమ్ ॥ 16 ॥
ప్రతిపదార్థము: సూక్ష్మ + అర్థ =
నిగూఢమైన వ్యంగ్యార్థములను, దర్శన = చూచుట యొక్క (గ్రహించుట యొక్క), విమర్శ + వశ = విచారణా ఫలితముగా, ప్రరూఢ =
పుట్టినట్టి, భ్రూకాణ్డ = కనుబొమ్మల యొక్క, తాణ్డవ = నాట్యముచేత, నివేదిత = తెలియజేయబడిన,
చిత్ + వికాసమ్ = చైతన్య ఉల్లాసము (జ్ఞానోదయము) కలిగినట్టియు,
సుమతయో = నిర్మల బుద్ధి గల పండితులు, యత్ = ఏ,
సూక్త + అమృతం = అమృతము వంటి సూక్తులను, ఆస్వాద్య
= రుచి చూచి (అనుభవించి), ముఖం = తమ ముఖములను, ఉద్వహన్తి = ధరించుచున్నారో, కవి + కుఞ్జరాణమ్ = కవి
శ్రేష్ఠుల యొక్క, తత్ = అట్టి, సూక్తామృతం
= సూక్తి అనే అమృతము, జయతి = సర్వోత్కృష్టముగా
వెలుగొందుచున్నది.
తాత్పర్యము: కవి శ్రేష్ఠుల
సూక్తులు అమృతం వంటివి. పండితులు ఆ కవిత్వములోని సూక్ష్మమైన వ్యంగ్యార్థాలను
గ్రహించినప్పుడు, వారి హృదయము చైతన్యంతో వెలిగిపోతుంది. ఆ ఆనందము వారి
కనుబొమ్మల నాట్యము ద్వారా ముఖముపై వ్యక్తమవుతుంది. అట్టి అద్భుతమైన కావ్యము
ఎప్పుడూ జయప్రదముగా ఉంటుంది.
విశేషములు:
- గంభీరమైన అర్థాన్ని గ్రహించినప్పుడు కలిగే ముఖ
వికాసాన్ని కవి ఇక్కడ రమణీయముగా వర్ణించారు.
పదిహేడవ
శ్లోకము
శబ్దార్థమాత్రమపి
యే న విదన్తి తేఽపి యాం మూర్ఛనామివ మృగాః శ్రవణైః పిబన్తః ।
సంరుద్ధసర్వకరణప్రసరా భవన్తి చిత్రస్థితా ఇవ కవీన్ద్రాగిరం నుమస్తామ్ ॥ 17 ॥
ప్రతిపదార్థము: యే = ఎవరు, శబ్ద + అర్థ
+ మాత్రమ్ + అపి = శబ్దము యొక్క సామాన్య అర్థమును కూడా, న +
విదన్తి = తెలియరో, తే + అపి = అట్టివారు కూడా, యాం = ఏ కవి వాక్కును, మృగాః = జింకలు, మూర్ఛనాం + ఇవ = సంగీతము యొక్క ఆరోహణ అవరోహణ స్వరములను వలె, శ్రవణైః = చెవులతో, పిబన్తః = తాగుచున్నవారై
(వినుచున్నవారై), సంరుద్ధ = ఆగిపోయిన, సర్వ
+ కరణ = అన్ని ఇంద్రియముల (జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల), ప్రసరాః
= సంచారము గలవారై, చిత్రం + స్థితాః + ఇవ = చిత్రపటములోని
బొమ్మల వలె నిశ్చలముగా, భవన్తి = అవుచున్నారో, తాం = అట్టి, కవీన్ద్రా + గిరం = కవి శ్రేష్ఠుల
వాక్కును, నుమః = స్తుతించుచున్నాము.
తాత్పర్యము: సంగీతాన్ని
వినేటప్పుడు జింకలు ఏమీ తెలియకపోయినా పరవశించి ఎలా నిశ్చలమైపోతాయో, అలాగే
అర్థము తెలియని సామాన్యులు కూడా మహాకవుల కవిత్వము వింటే, తమ
ఇంద్రియాల చైతన్యాన్ని మరిచి చిత్రపటంలోని బొమ్మల వలె స్తంభించిపోతారు. అట్టి
దివ్యమైన కవి వాక్కుకు నమస్కరిస్తున్నాము.
విశేషములు:
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి
గానరసం ఫణీ అనాలి. (ఫణిః అనకూడదు.)ఫణతి విస్తృతో భవతి విస్తృతమగునది
కనుక పాము పడగను ఫణము అంటారు. ఫణము కలది కనుక పామును ఫణీ అంటారు. పూర్తి శ్లోకం
ఇది
శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణీ
కో వేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవా
శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణీ" - పశువుయొక్క చపలాన్ని, శిశువుయొక్క చపలాన్ని, ఫణియొక్క చపలాన్ని అరికట్టి అద్వైత రసానుభూతి సమాధికి చేర్చే విద్య
గానవిద్య.
పశువు నందీశ్వరుడు; శిశువు
కుమారస్వామి ఫణి ఆదిశేషుడు - అంతకు మించి శివుని, కేశవుని
సైతం డోల లూగించే విద్య గానవిద్య. వేదములలో ఒక భాగమే గానరూపమై వెలసింది. అని
పెద్దలు దీనికి విస్తృతమైన అర్థం ఇచ్చారు.
పద్దెనిమిదవ
శ్లోకము
లభ్యః
స కుత్ర సుజనః స్వకృతీః ప్రదర్శ్య భ్రూకన్దలీయుగలమాకలయన్తి యస్య
। నేత్రోత్పలోపరి పరిస్ఫురదుత్తరఙ్గ- భృఙ్గావలిద్వితయావిభ్రమభృత్కవీన్ద్రాః
॥ 18 ॥
ప్రతిపదార్థము: కవీన్ద్రాః =
మహాకవులు, స్వ + కృతీః = తమ రచనలను, ప్రదర్శ్య = చూపించి,
యస్య = ఏ పండితుని యొక్క, నేత్ర + ఉత్పల +
ఉపరి = కళ్లు అనే నల్లకలువల పైన, పరిస్ఫురత్ =
ప్రకాశించుచున్న, ఉత్తరఙ్గ = చంచలమైన, భృఙ్గా
+ ఆవలి + ద్వితయ = రెండు తుమ్మెదల గుంపుల యొక్క, విభ్రమ =
విలాసమును (కదలికను), భృత్ = ధరించుచున్న, భ్రూ + కన్దలీ + యుగలం = కనుబొమ్మల తీగల జంటను, ఆకలయన్తి
= చూస్తున్నారో, సః = అట్టి, సుజనః =
సహృదయుడైన పండితుడు, కుత్ర = ఎక్కడ, లభ్యః
= లభిస్తాడు?.
తాత్పర్యము: తమ కవిత్వాన్ని
వినిపించినప్పుడు, ఆ ఆనందంతో కనుబొమ్మలు కదిలిస్తూ, కళ్లు
వికసింపజేసే సహృదయుడైన శ్రోత దొరకడం మహాకవులకు చాలా అరుదు. అట్టి శ్రోత ఎక్కడ
దొరుకుతాడు? (అనగా దొరకడం కష్టమని భావము).
విశేషములు:
- కళ్లను నల్లకలువలతోను, కనుబొమ్మల కదలికను
తుమ్మెదల విలాసముతోను పోల్చుట ఇక్కడి విశేషము.
- కవి తన కవిత్వాన్ని మెచ్చే నిజమైన సహృదయుని కోసం
పరితపించే స్థితి ఇక్కడ వర్ణించబడింది.
పందొమ్మిదవ
శ్లోకము
స్ఫారేణ
సౌరభభరేణ కిమేణనాభే- తద్ధానసారమపి సారమసారమేవ । స్రక్సౌమనస్యపి
న పుష్యతి సౌమనస్యం ప్రస్యన్దతే యది మధుద్రవముక్తిదేవీ ॥ 19 ॥
ప్రతిపదార్థము: మధు + ద్రవం =
అమృతము వంటి రసమును, ఉక్తిదేవీ = వాగ్దేవి, ప్రస్యన్దతే +
యది = కురిపించినట్లయితే (మంచి కవిత్వము లభించినట్లయితే), ఏణనాభేః
= కస్తూరి యొక్క, స్ఫారేణ = గొప్పదైన, సౌరభ
+ భరేణ = సువాసన భారముతో, కిమ్ = ఏమి ప్రయోజనము?, తత్ = అప్పుడు, ఘానసారమ్ + అపి (వ్యాఖ్యానమున
ఘనసారము) = కర్పూరము కూడా, సారమ్ = శ్రేష్ఠమైనదైనా, అసారమ్ + ఏవ = సారము లేనిదిగానే (వెలవెలబోవును), సౌమనసీ
= పూల యొక్క, స్రక్ + అపి = మాల కూడా, సౌమనస్యం
= సంతోషమును, న + పుష్యతి = పెంచదు.
తాత్పర్యము: వాగ్దేవి
అనుగ్రహించి అమృతము వంటి కవిత్వాన్ని ప్రసాదిస్తే, కస్తూరి సువాసనలు, కర్పూరము యొక్క చల్లదనము, సుగంధము కలిగిన పూలమాలలు
కూడా ఆ కవిత్వము ఇచ్చే ఆనందము ముందు దిగదుడుపే. ఆ కవిత్వ రసాస్వాదన ముందు ఇవన్నీ
నిస్సారముగా తోస్తాయి.
విశేషములు:
- కవిత్వము ఇచ్చే బ్రహ్మానంద సహోదరమైన ఆనందము ముందు
లౌకిక సుగంధ ద్రవ్యాలు ఇచ్చే సుఖము తృణప్రాయమని భావము.
- 'సౌమనస్యం' అనగా పూలమాల వల్ల కలిగే
ప్రమోదము అని అర్థము.
ఇరవయ్యవ
శ్లోకము
సంసారమారవపథప్రథమానఖేద- విచ్ఛేదకోవిదమిదం
కవికర్మ జీయాత్ । విస్మారితం యదమునా యమునాసనాథం పాథః ప్రసిద్ధమపి
వైబుధసైన్ధవం నః ॥ 20 ॥
ప్రతిపదార్థము: సంసార = జనన మరణ
రూపమైన ఈ సంసారమనే, మారవ + పథ = ఎడారి మార్గము నందు, ప్రథమాన
= వృద్ధి చెందుతున్న, ఖేద = దుఃఖమును (అలసటను), విచ్ఛేద = తొలగించుట యందు, కోవిదమ్ = నిపుణమైనదియు,
ఇదం = ఈ, కవికర్మ = శివభక్తి రసముతో కూడిన
కవిత్వము, జీయాత్ = జయించుగాక (వర్ధిల్లాలి), యత్ = ఏ కవిత్వము చేతనైతే, యమునా + సనాథం = యమునా
నదితో కూడినట్టి (ప్రసిద్ధమైన గంగా-యమునా సంగమము నందలి), వైబుధ
+ సైన్ధవం = దేవనదియైన గంగానది యొక్క, పాథః = జలము, అమునా = ఈ కవిత్వము చేత, నః = మనకు, విస్మారితమ్ = మరుపునకు వచ్చేలా చేయబడినదో.
తాత్పర్యము: సంసారమనే ఎడారిలో
ప్రయాణించే మనిషికి కలిగే అలసటను, తాపాన్ని పోగొట్టడంలో ఈ శివస్తోత్ర రూపమైన
కవిత్వము మిక్కిలి నేర్పరి. గంగా-యమునా సంగమ జలాల వల్ల కలిగే పుణ్యము కంటే,
ఈ కవిత్వ రసాస్వాదన వల్ల కలిగే ఆనందము మిన్నగా ఉంటుంది. ఈ కవిత్వము
ఆ గంగా జలాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది.
విశేషములు:
- సంసారాన్ని ఎడారితోను, కవిత్వమును ఆ తాపాన్ని
పోగొట్టే ఔషధముతోను పోల్చుట ఇక్కడి విశేషము.
- 'యమునాసనాథం పాథః' అనగా అలహాబాదు
(ప్రయాగ) లోని గంగా-యమునా సంగమమని అర్థము.
ఇరవై
ఒకటవ శ్లోకము
గామ్భీర్యశాలిని
శుచావమృతౌఘశీతే నీతే సదా సదనతాం మదనాన్తకేన । యస్యైకపిఙ్గలగిరేరివ
మానసేఽన్త- రర్థాః స్ఫురన్తి స వినా సుకృతైః క్వ లభ్యః ॥ 21 ॥
ప్రతిపదార్థము: మదనాన్తకేన =
మన్మథుడిని సంహరించిన శివునిచేత, సదా = ఎల్లప్పుడు, సదనతాం
= తన నివాసముగా, నీతే = చేయబడినట్టియు, గామ్భీర్య + శాలిని = గంభీరత్వముతో కూడినట్టియు, శుచౌ
= నిర్మలమైనట్టియు, అమృత + ఓఘ + శీతే = అమృత ప్రవాహము వలె
చల్లనైనట్టియు, యస్య = ఏ కవి యొక్క, మానసే
= మనస్సు నందు (పక్షమున మానస సరోవరము నందు), ఏకపిఙ్గాలగిరేః
+ ఇవ = కుబేరుని నివాసమైన కైలాస పర్వతము వలె, అన్తః = లోపల,
అర్థాః = వాచ్య, లక్ష్య, వ్యంగ్యార్థములు (పక్షమున వివిధ పదార్థములు), స్ఫురన్తి
= ప్రకాశించునో, సః = అట్టి కవి, సుకృతైః
+ వినా = పుణ్యము లేకుండా, క్వ = ఎక్కడ, లభ్యః = లభిస్తాడు? (అనగా దొరకడు).
తాత్పర్యము: ఎవరి హృదయము
గంభీరముగా, నిర్మలముగా ఉండి, సాక్షాత్తు పరమశివుడికి నివాస
స్థానమై ఉంటుందో, ఎవరి మనస్సులో కైలాస పర్వతము పై నుండి మానస
సరోవరము లోకి నీరు వచ్చినట్లుగా దివ్యమైన అర్థాలు స్ఫురిస్తాయో, అట్టి మహాకవిని దర్శించడం పూర్వజన్మ సుకృతం ఉంటేనే సాధ్యమవుతుంది.
విశేషములు:
- 'ఏకపిఙ్గల' అనగా కుబేరుడు. ఆయన
నివాసమైన కైలాసముతో కవి మనస్సును పోల్చడము గొప్ప చమత్కారము.
- కవి మనస్సులోని 'అర్థములు' (కవిత్వార్థము),
మానస సరోవరములోని 'అర్థములు' (వస్తువులు) శ్లేషలో వాడబడ్డాయి.
ఇరవై
రెండవ శ్లోకము
యస్య
ద్యుసిన్ధులహరీశుచయో న కస్య దృష్టిప్రసాదమవలోకయతోఽర్పయన్త్యః । గావః
సుధారసముచః ప్రసరన్తి దిక్షు విశ్వైకభూషణమసౌ జయతి ద్విజేన్ద్రః ॥ 22 ॥
ప్రతిపదార్థము: ద్యుసిన్ధు + లహరీ
+ శుచయః = గంగా తరంగముల వలె పవిత్రమైనట్టియు, అవలోకయతః = చూచుచున్న (విచారించుచున్న),
కస్య = ఏ మనిషికి, దృష్టి + ప్రసాదమ్ =
జ్ఞానము యొక్క నిర్మలత్వమును (పక్షమున కన్నుల ఆనందమును), న +
అర్పయన్త్యః = ఇవ్వవు? (అందరికీ ఇస్తాయి), సుధా + రస + ముచః = అమృత రసమును కురిపించునట్టియు, యస్య
= ఏ కవి యొక్క, గావః = వాక్కులు (పక్షమున చంద్రుని కిరణములు),
దిక్షు = దిక్కుల యందు, ప్రసరన్తి =
ప్రసరించునో, విశ్వ + ఏక + భూషణమ్ = లోకానికి ఏకైక అలంకారమైన,
అసౌ = అట్టి, ద్విజేన్ద్రః = కవి శ్రేష్ఠుడు
(పక్షమున చంద్రుడు), జయతి = సర్వోత్కృష్టముగా
వెలుగొందుచున్నాడు.
తాత్పర్యము: గంగా తరంగాల వలె
పవిత్రమైన వాక్కులతో, అమృతము వంటి రసమును కురిపిస్తూ, లోకమంతటా
తన కీర్తిని వ్యాపింపజేసే మహాకవి చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు తన
కిరణాలతో కంటికి ఎలా హాయినిస్తాడో, ఈ కవి తన వాక్కులతో
పండితుల బుద్ధికి అలా ప్రసన్నతను కలిగిస్తాడు.
విశేషములు:
- 'ద్విజేన్ద్ర' అనగా బ్రాహ్మణ
శ్రేష్ఠుడు లేదా కవి శ్రేష్ఠుడు అనియు, మరియు చంద్రుడు
అనియు అర్థము.
- 'గావః' అనగా కిరణములు మరియు వాక్కులు
అని అర్థము. ఈ శ్లోకము శ్లేషాలంకారముతో కూడి ఉంది.
ఇరవై
మూడవ శ్లోకము
సంయోగమేత్య
పరమర్థపరిష్కృతస్య పాదాన్తగోఽపి గురుతాం లఘురేతి యస్య ।
తం శంకరస్తుతిపరం పరిశుద్ధవృత్తం సుశ్లోకమాప్య ముదమేతి న కస్య చేతః ॥ 23 ॥
ప్రతిపదార్థము: పరమ + అర్థ +
పరిష్కృతస్య = మిక్కిలి అర్థముతో (ధనముతో) కూడినవాని యొక్క, సంయోగమ్ +
ఏత్య = కలయికను పొంది, యస్య = ఎవరి యొక్క, పాద + అన్త + గః + అపి = పాదముల సమీపమునకు చేరినవాడైనను, లఘుః = సామాన్యుడైనవాడు కూడా, గురుతామ్ =
గొప్పతనమును (గౌరవమును), ఏతి = పొందునో, తం = అట్టి, శంకర + స్తుతి + పరం = శివ స్తోత్రము
నందు ఆసక్తి గలవానిని, పరిశుద్ధ + వృత్తం = మంచి ప్రవర్తన
గలవానిని, సుశ్లోకమ్ = మంచి కీర్తి గలవానిని, ఆప్య = పొంది (దర్శించి), కస్య + చేతః = ఎవరి మనస్సు,
ముదమ్ = సంతోషమును, న + ఏతి = పొందదు?
(అందరి మనస్సులు పొందుతాయి).
ఛన్దస్సు పరముగా
అర్థము: పరమ + అర్థ + పరిష్కృతస్య = గొప్ప అర్థముతో కూడిన ఏ శ్లోకము యొక్క, సంయోగమ్ +
ఏత్య = సంయోగమును (వ్యాకరణ నియమమును) పొంది, పాద + అన్త + గః
+ అపి = పాదము చివర ఉన్నవాడైనను, లఘుః = లఘు అక్షరము కూడా,
గురుతామ్ = గురువుగా (గుర్వక్షరముగా), ఏతి =
మారునో, తం = అట్టి, పరిశుద్ధ + వృత్తం
= నిర్దోషమైన ఛందస్సు గల, సుశ్లోకమ్ = మంచి శ్లోకమును,
ఆప్య = చదివి, కస్య + చేతః = ఎవరి మనస్సు,
ముదమ్ = ఆనందమును, న + ఏతి = పొందదు?
తాత్పర్యము: నిర్మలమైన చరిత్ర
కలిగి, శివ స్తుతిలో నిమగ్నమై, ఎవరిని ఆశ్రయిస్తే
సామాన్యులు కూడా గొప్పవారవుతారో అట్టి పుణ్యాత్ముడిని చూస్తే ఎవరికైనా ఆనందం
కలుగుతుంది. అలాగే, ఛందస్సులో సంయోగము వల్ల లఘువు కూడా
గురువుగా మారినట్లు, నిర్దోషమైన ఛందస్సు, అర్థము కలిగిన శ్లోకాన్ని చదివితే అందరికీ ఆనందం కలుగుతుంది.
విశేషములు:
- ఇక్కడ ఛందస్సు శాస్త్ర నియమాన్ని (లఘువు గురువుగా
మారడము) కవి ఒక గొప్ప చమత్కారముగా వాడారు.
- 'వృత్తం' అనగా ప్రవర్తన మరియు
ఛందస్సు అని, 'శ్లోకము' అనగా
కీర్తి మరియు పద్యము అని శ్లేషార్థములు.
ఇరవై నాలుగవ శ్లోకము
ఇహ హి
మహిమా మాయామోహప్రరోహతిరోహిత- త్రిజగదగదంకారః సారస్వతః ప్రథతే సతామ్ ।
ప్రభవతి జరామృత్యువ్యాధిప్రబన్ధనిబన్ధన- వ్యసనజనితవ్యాపత్తాపక్కలమాపగమాయ
యః ॥ 24 ॥
ప్రతిపదార్థము: మాయా = అవిద్య
(శివుని కంటే జగత్తు భిన్నమనే భ్రమ), మోహ = అజ్ఞానము యొక్క, ప్రరోహ = పుట్టుకచేత, తిరోహిత = కప్పబడిన, త్రిజగత్ = మూడు లోకములకు, అగదంకారః = వైద్యుడు
(చికిత్సకుడు) అయినట్టియు, సారస్వతః = వాగ్దేవికి సంబంధించిన,
మహిమా = కవిత్వ మహిమ, ఇహ = ఈ లోకమున, సతామ్ = పండితుల యందు, ప్రథతే = ప్రసిద్ధి
చెందుచున్నది, యః = ఏ మహిమ (కవిత్వము), జరా = ముసలితనము, మృత్యు = మరణము, వ్యాధి = రోగముల యొక్క, ప్రబన్ధ + నిబన్ధన = వరుస
క్రమము యొక్క అనుసంధానము వలన, జనిత = పుట్టినట్టి, వ్యాపత్ = ఆపద యొక్క, తాప = వేడి వల్ల కలిగిన,
క్లమ = అలసటను (దుఃఖమును), అపగమాయ =
తొలగించుటకు, ప్రభవతి = సమర్థమగుచున్నదో.
తాత్పర్యము: మాయా మోహాల వల్ల
అజ్ఞానంలో మునిగిపోయిన ఈ ముల్లోకాలకు సత్కవిత్వమే ఒక దివ్యౌషధము. ముసలితనము, వ్యాధులు,
మరణము అనే చక్రంలో చిక్కుకున్న మానవుల తాపాన్ని, అలసటను పోగొట్టడానికి ఈ సారస్వత మహిమ (శివభక్తి కవిత్వము) సమర్థవంతముగా
పనిచేస్తుంది.
విశేషములు:
- 'అగదంకారః' అనగా రోగములను హరించే
వైద్యుడు అని అర్థము. సంసార రోగానికి కవిత్వము ఔషధముగా ఇక్కడ వర్ణించబడింది.
ఇరవై
ఐదవ శ్లోకము
చమత్కారోత్కర్షం
కమపి కమనీయం విమృశతాం దిశన్తీ సా కాచిజ్జయతి కవివాచాం పరిణతిః
। యదాసృష్టే చేతస్యమృతమితి నిఃశ్రేయసమితి ప్రియం ధామేత్యుచ్చైః
పదమితి సముద్యన్తి మతయః ॥ 25 ॥
ప్రతిపదార్థము: విమృశతాం =
విచారించునట్టి పండితులకు, కమపి = అనిర్వచనీయమైన, కమనీయం =
మనోహరమైన, చమత్కార + ఉత్కర్షం = చమత్కారము యొక్క అతిశయమును,
దిశన్తీ = ఇచ్చునట్టియు, సా = అట్టి, కాచిత్ = ఒకానొక శ్రేష్ఠమైన, కవివాచాం = కవి వాక్కుల
యొక్క, పరిణతిః = ప్రౌఢత్వము (పరిపాకము), జయతి = వర్ధిల్లుచున్నది, యత్ + ఆసృష్టే = ఏ
కవిత్వము సోకగానే, చేతసి = హృదయము నందు, ఇదం + ఏవ = ఇదే, అమృతం + ఇతి = అమృతమనియు, నిఃశ్రేయసం + ఇతి = మోక్షమనియు, ప్రియం + ధామ + ఇతి
= అత్యంత ప్రియమైన తేజస్సు (నివాసము) అనియు, ఉచ్చైః + పదం +
ఇతి = అత్యున్నతమైన పదమనియు, మతయః = బుద్ధులు (భావనలు),
సముద్యన్తి = పుట్టుచున్నవో.
తాత్పర్యము: శివభక్తి రసంతో
కూడిన కవి ప్రౌఢోక్తి పండితుల హృదయాలను తాకగానే, వారికి అది అమృతం వలె, మోక్షం వలె, పరమ పవిత్రమైన ధామం వలె తోస్తుంది.
అట్టి అనిర్వచనీయమైన కవిత్వ పరిపాకము సర్వోత్కృష్టమై వెలుగొందుచున్నది.
విశేషములు:
- ఉత్తమ కవిత్వము ఇచ్చే ఆనందము మోక్షానందముతో సమానమని
ఇక్కడ కవి ఉద్ఘాటించారు.
ఇరవై
ఆరవ శ్లోకము
మధుస్యన్దీ
మన్దీకృతవిపదుపాధిర్భవమరు- భ్రమక్కేశావేశప్రశమకమనీయో విజయతే । అఖణ్డశ్రీఖణ్డద్రవనవసుధాసారసరసః
ప్రసాదో వాగ్దేవ్యాః ప్రవరకవికావ్యామృతవపుః ॥ 26 ॥
ప్రతిపదార్థము: మధు + స్యన్దీ =
అమృతమును (తేనెను) కురిపించునట్టియు, మన్దీకృత = తగ్గించబడిన, విపత్ + ఉపాధిః = ఆపదలు, మనోవ్యాధులు గలదియు,
భవ + మరు = సంసారమనే ఎడారిలో, భ్రమన్ =
తిరుగుట వల్ల కలిగిన, క్లేశ + ఆవేశ = దుఃఖముల యొక్క
అతిశయమును, ప్రశమ = శాంతింపజేయుట యందు, కమనీయః = కోరదగినదియు, అఖణ్డ = పరిపూర్ణమైన, శ్రీఖణ్డ + ద్రవ = గంధపు రసము వలెను, నవ + సుధా +
సార = కొత్త అమృతము వలెను, సరసః = రసవంతమైనట్టియు, ప్రవర + కవి + కావ్య + అమృత + వపుః = శ్రేష్ఠులైన కవుల కావ్యమనే అమృతమే
శరీరముగా కలిగిన, వాగ్దేవ్యాః = సరస్వతీ దేవి యొక్క, ప్రసాదః = అనుగ్రహము, విజయతే = సర్వోత్కృష్టముగా
ప్రకాశించుచున్నది.
తాత్పర్యము: మహాకవుల కావ్యమే
శరీరముగా కలిగిన వాగ్దేవి అనుగ్రహము ఎంతో గొప్పది. అది సంసారమనే ఎడారిలో అలసిపోయిన
వారికి చల్లని గంధపు రసము వలె, అమృతము వలె ఉపశమనాన్ని ఇస్తుంది. ఆ
అనుగ్రహము మనోవ్యాధులను పోగొట్టి పరమానందాన్ని ప్రసాదిస్తుంది.
విశేషములు:
- 'శ్రీఖణ్డ' అనగా గంధము. గంధపు రసము
వంటి చల్లదనాన్ని, అమృతము వంటి మాధుర్యాన్ని కవిత్వము
ఇస్తుందని భావము.
- వాగ్దేవికి కవుల కావ్యాలే శరీరమని చెప్పడం ద్వారా
కవిత్వము యొక్క దివ్యత్వము చాటబడింది.
ఇరవై
ఏడవ శ్లోకము
ఘనానన్దస్యన్దోద్గతవిపులబాష్పార్ద్రనయనం సలీలభ్రూవల్లీవలనవివలద్భాలపులినమ్
। ఉదఞ్చద్రోమాఞ్చస్తబకితకపోలం విదధతే సుధార్ద్రా ధన్యానాం
వదనమనవద్యాః కవిగిరః ॥ 27 ॥
ప్రతిపదార్థము: సుధా + ఆర్ద్రాః =
అమృతముతో తడిసినట్టియు, అనవద్యాః = దోషరహితమైనట్టియు, కవిగిరః =
కవుల వాక్కులు, ధన్యానాం = పుణ్యాత్ముల యొక్క, వదనం = ముఖమును, ఘన + ఆనన్ద = గాఢమైన ఆనంద ప్రవాహము
(స్యన్ద) వలన, ఉద్గత = పుట్టిన, విపుల
= అధికమైన, బాష్ప = కన్నీళ్లతో (ఆనంద బాష్పములతో), ఆర్ద్ర = తడిసిన, నయనం = కళ్లు కలిగినదిగాను,
సలీల = విలాసముతో కూడిన, భ్రూవల్లీ =
కనుబొమ్మల తీగల యొక్క, వలన = కదలికచేత, వివలత్ = ముడతలు పడిన, భాల + పులినమ్ = లలాటము
(నొసలు) అనే ఇసుక తిన్నె కలిగినదిగాను, ఉదఞ్చత్ =
పుట్టుచున్న, రోమాఞ్చ = గగుర్పాటుతో, స్తబకిత
= పూలగుత్తులు పూచినట్లున్న, కపోలం = చెంపలు కలిగినదిగాను,
విదధతే = చేయుచున్నవి.
తాత్పర్యము: నిర్దోషమైన మహాకవుల
వాక్కులు పుణ్యాత్ములైన శ్రోతల ముఖాలలో అద్భుతమైన మార్పులు తెస్తాయి. ఆ కవిత్వము
విన్నప్పుడు కలిగే ఆనందంతో వారి కళ్లు ఆనంద బాష్పాలతో తడుస్తాయి, కనుబొమ్మల
కదలికతో నొసలు ముడతలు పడి ప్రకాశిస్తుంది, శరీరమంతా పులకించి
చెంపలపై రోమాంచము పూలగుత్తులు పూసినట్లు కనిపిస్తుంది.
విశేషములు:
- ఇది కావ్యానందము కలిగినప్పుడు కలిగే శారీరక వికారాల
(సాత్విక భావాల) అద్భుత వర్ణన.
- 'భాలపులినమ్' మరియు 'స్తబకితకపోలం' అనుటలో రూపక అలంకారములు కలవు.
ఇరవై
ఎనిమిదవ శ్లోకము
ధన్యానామమృతద్రవన్తి
హృదయే కర్ణే వలన్మల్లికా- లంకారస్తబకన్తి కణ్ఠపులినే
ముక్తాకలాపన్త్యపి । శైలాన్దోలితదుగ్ధసిన్ధులహరీభఙ్గాభిరామోద్గమాః శ్యామాకాముకఖణ్డమణ్డనకథాసందర్భగర్భా
గిరః ॥ 28 ॥
ప్రతిపదార్థము: శ్యామాకాముక + ఖణ్డ
= చంద్రవంకను, మణ్డన = ఆభరణముగా కలిగిన శివుని యొక్క, కథా + సందర్భ
= కథా విధానమును, గర్భాః = లోపల కలిగినట్టి, గిరః = కవి వాక్కులు, ధన్యానాం = పుణ్యాత్ముల యొక్క,
హృదయే = హృదయమునందు, అమృత + ద్రవన్తి = అమృత
ప్రవాహము వలె ప్రవర్తించును, కర్ణే = చెవి యందు, వలత్ = ఒప్పుచున్న, మల్లికా + అలఙ్కార + స్తబకన్తి =
మల్లెపూల అలంకారపు గుత్తి వలె ప్రవర్తించును, కణ్ఠ + పులినే
= కంఠము అనే తీరము నందు, ముక్తా + కలాపన్తి + అపి = ముత్యాల
హారము వలె ప్రవర్తించును, (అట్టి వాక్కులు), శైల = మందర పర్వతముచే, ఆన్దోలిత = మథించబడిన,
దుగ్ధ + సిన్ధు = క్షీరసముద్రము యొక్క, లహరీ +
భఙ్గ = అలల సమూహము వలె, అభిరామ = మనోహరమైన, ఉద్గమాః = పుట్టుక కలిగినవి.
తాత్పర్యము: చంద్రమౌళియైన
పరమశివుని కథాసందర్భమును కలిగిన మహాకవుల వాక్కులు క్షీరసాగర మథనమున పుట్టిన అలల
వలె అత్యంత మనోహరముగా ఉంటాయి. అవి పుణ్యాత్ముల హృదయమున అమృతము వలెను, చెవులకు
మల్లెపూల గుత్తుల వలెను, కంఠమునకు ముత్యాల హారము వలెను
అలంకారముగా ఉండి ఆనందాన్ని ఇస్తాయి.
విశేషములు:
- 'అమృతద్రవన్తి', 'స్తబకన్తి' మొదలైన పదములు క్రియలుగా వాడబడినవి (క్విబ్ ప్రత్యయము). అనగా ఆ
వాక్కులే అమృతముగా, పూలగుత్తిగా మారుతాయని భావము.
ఇరవై
తొమ్మిదవ శ్లోకము
ధన్యానాం
భణితిచ్ఛలేన వదనేషూద్యన్తి హృత్కర్ణికా- ధామ్రః
సూక్తిసుధావబోధవిధుతాపీడస్య చణ్డీపతేః । కిం జూటాహికిరీటరత్నరుచయః కిం
స్త్రగ్రజఃసూచయః కిం మౌలీన్దుమరీచయః కిమమరస్రోతస్వతీవీచయః ॥ 29 ॥
ప్రతిపదార్థము: ధన్యానాం =
పుణ్యాత్ములైన కవుల యొక్క, వదనేషు = ముఖముల యందు, భణితి + ఛలేన =
కవిత్వము అనే నెపముతో, హృత్ + కర్ణికా + ధామ్రః = హృదయము అనే
పద్మమున నివసించువాడును, సూక్తి + సుధా + అవబోధ = కవిత్వమనే
అమృతమును వినుటచే, విధుత + ఆపీడస్య = కదిలించబడిన శిరస్సు
గలవాడునైన, చణ్డీపతేః = పరమశివుని యొక్క, జూటా + అహి + కిరీట + రత్న + రుచయః + కిమ్ = జటాజూటము నందలి సర్పముల మకుట
రత్న కాంతులా ఇవి?, కిమ్ = లేదా, స్రక్
+ రజః + సూచయః + కిమ్ = ఆయన ధరించిన మాలల పూరేణువుల సమూహములా ఇవి?, కిమ్ = లేదా, మౌలి + ఇన్దు + మరీచయః + కిమ్ =
శిరస్సుపై నున్న చంద్రుని కిరణములా ఇవి?, కిమ్ = లేదా,
అమర + స్రోతస్వతీ + వీచయః + కిమ్ = దేవనదియైన గంగ యొక్క అలలా ఇవి?,
(అనునట్లుగా ఆ వాక్కులు) ఉద్యన్తి = ఉద్భవించుచున్నవి.
తాత్పర్యము: శివభక్తులైన కవులు
కవిత్వము చెబుతున్నప్పుడు, వారి హృదయ పద్మములో ఉన్న శివుడు ఆ కవిత్వ మాధుర్యానికి
పరవశించి తల ఊపుతాడు. అప్పుడు ఆయన జటలలోని రత్నాల కాంతులు, పూల
రేణువులు, చంద్ర కిరణాలు, గంగా తరంగాలు
ఒకేసారి వెలువడి కవి ముఖము నుండి వాక్కుల రూపంలో బయటకు వస్తున్నాయా అన్నట్లు ఆ
సూక్తులు అతిశయిస్తాయి.
విశేషములు:
- కవి చెప్పే ప్రతి మాట శివుని శిరస్సు నుండి వెలువడే
పవిత్ర వస్తువులతో సమానమని ఇక్కడ ఉత్ప్రేక్షించబడింది. సందేహాలంకారము ద్వారా
శివ తత్త్వమును వర్ణించారు.
ముప్పదవ
శ్లోకము
సాన్ద్రేతి
। సాన్ద్రానన్దకరే భృతామృతకరే నాస్త్యేష రాకాకరే న
ప్రౌఢప్రసరే నిసర్గశిశిరే స్వర్గాపగానిర్ఝరే । గాఢప్రేమభరే స్మరజ్వరహరే
నోద్దామరామాధరే యః శంభోర్మధురే స్తుతివ్యతికరే హ్లాదః సుధాసోదరే ॥ 30 ॥
ప్రతిపదార్థము: సుధా + సోదరే =
అమృతమునకు తోడబుట్టినట్లున్న, మధురే = తియ్యనైన, శంభోః
= శివుని యొక్క, స్తుతి + వ్యతికరే = స్తోత్రము నందు,
యః = ఏ, హ్లాదః = పరమానందము (కలుగునో),
ఏషః = అట్టి ఆనందము, సాన్ద్ర + ఆనన్ద + కరే =
దట్టమైన ఆనందాన్ని ఇచ్చే, భృత + అమృత + కరే = అమృత కిరణములు
కలిగిన, రాకాకరే + అపి = పున్నమి చంద్రుని యందును, నాస్తి = లేదు, ప్రౌఢ + ప్రసరే = వేగముగా
ప్రవహించునట్టియు, నిసర్గ + శిశిరే = స్వభావముచేత
చల్లనైనట్టియు, స్వర్గాపగా + నిర్ఝరే = ఆకాశగంగ ప్రవాహము
నందును, నాస్తి = లేదు, గాఢ + ప్రేమ +
భరే = గాఢమైన అనురాగము కలిగినట్టియు, స్మర + జ్వర + హరే =
మన్మథ తాపాన్ని పోగొట్టునట్టియు, ఉద్దామ + రామా + అధరే + నో
= అందగత్తె యొక్క అధరము (పెదవి) నందును లేదు.
తాత్పర్యము: పరమశివుని
స్తోత్రము చేయడము వల్ల కలిగే బ్రహ్మానందము అమృతము వంటిది. అట్టి ఆనందము చల్లని
వెన్నెలనిచ్చే చంద్రుడి వల్ల గానీ, పవిత్రమైన గంగా ప్రవాహము వల్ల గానీ,
చివరకు ప్రేయసి అధరామృతము వల్ల గానీ లభించదు. శివస్తుతి వల్ల కలిగే
ఆనందము వీటన్నింటికంటే మిన్నయైనది.
విశేషములు:
- లౌకిక సుఖములు, ప్రకృతి సిద్ధమైన ఆహ్లాదముల కంటే
భగవంతుని స్తుతించడం వల్ల కలిగే ఆనందమే అత్యున్నతమని ఇక్కడ నిరూపించబడింది.
ముప్పై
ఒకటవ శ్లోకము
ఓజస్వీ
మధురః ప్రసాదవిశదః సంస్కారశుద్ధోఽభిధా- భక్తివ్యక్తివిశిష్టరీతిరుచితైరర్థైర్ధృతాలంకర్తిః
। వృత్తస్థః పరిపాకవానవిరసః సద్వృత్తిరప్రాకృతః శస్యః కస్య న
సత్కవిర్భువి యథా తస్యైవ సూక్తిక్రమః ॥ 31 ॥
ప్రతిపదార్థము: ఓజస్వీ = తేజస్సు
కలిగినవాడు (పక్షమున ఓజోగుణము కలది), మధురః = మనోహరుడు (పక్షమున మాధుర్య గుణము
కలది), ప్రసాద + విశదః = శివానుగ్రహముచే నిర్మలుడు (పక్షమున
ప్రసాద గుణము కలది), సంస్కార + శుద్ధః = ఉత్తమ సంస్కారము
గలవాడు (పక్షమున వ్యాకరణ శుద్ధి గలది), అభిధా + భక్తి +
వ్యక్తి + విశిష్ట + రీతిః = పేరు, భక్తి, ప్రసిద్ధి కలిగిన రీతి గలవాడు (పక్షమున అభిధా, లక్షణ,
వ్యంజనా వృత్తులతో కూడిన వైదర్భీ రీతి గలది), ఉచిత
+ అర్థైః = తగిన ధనముతో (పక్షమున తగిన అర్థములతో), ధృత +
అలఙ్కృతిః = ఆభరణములు ధరించినవాడు (పక్షమున అలంకారములు కలిగినది), వృత్తస్థః = సదాచారము నందున్నవాడు (పక్షమున ఛందస్సు నందున్నది), పరిపాకవాన్ = పరిణతి గలవాడు, అవిరసః = విసుగు
లేనివాడు (పక్షమున సరసమైనది), సద్వృత్తిః = మంచి జీవనోపాధి
గలవాడు (పక్షమున కైశికీ మొదలైన వృత్తులు గలది), అప్రాకృతః =
సామాన్యుడు కానివాడు (పక్షమున ప్రాకృత భాషా గంధము లేనిది) అయిన, సత్కవిః = మహాకవి, తస్య + ఏవ = అతని యొక్క, సూక్తి + క్రమః + యథా = కవిత్వ విధానము వలె, భువి =
లోకమున, కస్య = ఎవరికి, న + శస్యః =
స్తుతించదగినవాడు కాడు? (అందరికీ స్తుతించదగినవాడే).
తాత్పర్యము: ఏ గుణాలైతే ఒక
ఉత్తమ కావ్యానికి ఉంటాయో (ఓజస్సు, మాధుర్యము, ప్రసాదము,
అలంకారము, ఛందస్సు మొదలైనవి), అవే లక్షణాలు ఆ కావ్యాన్ని రచించిన కవికి కూడా ఉంటే, అట్టి సత్కవి అందరికీ పూజ్యుడే. కవికి, అతని
కవిత్వానికి మధ్య గల అభేదాన్ని ఇక్కడ శ్లేషాలంకారముతో అద్భుతముగా వర్ణించారు.
విశేషములు:
- కవి యొక్క వ్యక్తిత్వము, కవిత్వము రెండు ఒకే విధమైన
పవిత్రతను, లక్షణాలను కలిగి ఉండాలని ఇక్కడ భావము.
- 'ఓజస్సు, మాధుర్యము, ప్రసాదము' అనునవి కావ్య గుణములు. 'అభిధా, లక్షణ (భక్తి), వ్యంజన
(వ్యక్తి)' అనునవి శబ్ద వ్యాపారములు.
ముప్పై రెండవ శ్లోకము
ప్రాప్తా
కల్పలతేవ చేద్భగవతీ వాగీశ్వరీ కైరపి ప్రాక్పుణ్యైః
స్వపరోపకారకరణప్రౌఢా పునర్దుర్లభా । అజ్ఞైస్తజ్జ్ఞజనోపదేశవిహితావజ్ఞైర్దురాశాహతై-
రస్తా దుర్మదకర్దమే ఫలతి కిం పాపం సశాపం వినా ॥ 32 ॥
ప్రతిపదార్థము: కైరపి = ఎవరి
చేతనైనా, ప్రాక్ + పుణ్యైః = పూర్వజన్మ సుకృతముల చేత, భగవతీ =
పూజ్యురాలైన, వాగీశ్వరీ = సరస్వతీ దేవి, కల్పలతా + ఇవ = కోరిన కోర్కెలీడేర్చే కల్పలత వలె, ప్రాప్తా
+ చేత్ = లభించినట్లయితే, స్వ + పర + ఉపకార + కరణ = తనకూ
మరియు ఇతరులకూ ఉపకారము చేయుటలో, ప్రౌఢా = సమర్థురాలైన అట్టి
వాక్కు, పునః = మరల, దుర్లభా =
దొరకనిది, (కానీ) తజ్జ్ఞజన = విద్వాంసుల యొక్క, ఉపదేశ = హితవచనముల యందు, విహిత + అవజ్ఞైః =
తిరస్కారము చూపేటట్టియు, దురాశా + హతైః = దురాశ (ధన లోభము)
చేత చెడిపోయినట్టియు, అజ్ఞైః = మూఢులైన కుకవుల చేత, (అట్టి వాక్కు) దుర్మద + కర్దమే = గర్వమనేడి బురదలో, అస్తా
= పడవేయబడినది. అట్టి స్థితి, సశాపం = శాపముతో కూడిన,
పాపం + వినా = పాపమును తప్ప, కిం + ఫలతి =
ఇంకేమి ఫలితమునిచ్చును?
తాత్పర్యము: పూర్వజన్మ
పుణ్యముంటేనే వాక్శుద్ధి కలుగుతుంది. అది కల్పలత వంటిది. అట్టి దివ్యమైన వాక్కును
తన ఆత్మశ్రేయస్సుకు, ఇతరుల మేలుకు ఉపయోగించాలి. కానీ ధనలోభం ఉన్న కుకవులు, పండితుల మాట వినకుండా తమ వాక్కును గర్విష్ఠులైన
అపాత్రుల స్తుతికి (బురదలో వేసినట్లు) ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వారికి పాపము,
శాపము తప్ప మరేమీ దక్కవు.
ముప్పై
మూడవ శ్లోకము
విస్రబ్ధం
విలసన్త్యుపస్కృతపదన్యాసా విలాసాలసా సాహంకారమకారణారిభిరభిధ్యాతాభిజాతాకృతిః
। క్షిప్తా దృప్తనృపాన్ధకూపకుహరే దాశైరివాశాగ్రహ- గ్రస్తైః
సూక్తినిభేన తారకరుణం గౌరీదృశీ రోదితి ॥ 33 ॥
ప్రతిపదార్థము: విస్రబ్ధం =
నమ్మకముతో, విలసన్తీ = ప్రకాశించుచున్నట్టియు, ఉపస్కృత +
పదన్యాసా = అలంకరించబడిన పదములు కలిగినట్టియు, విలాస + అలసా
= విలాసవంతమైన నడక గలదియు, అభిజాత + ఆకృతిః = ఉత్తమమైన రూపము
కలిగినట్టియునైన, గౌః = వాక్కు (పక్షమున ఆవు), ఆశాగ్రహ + గ్రస్తైః = ఆశ అనే మొసలిచే పట్టబడిన, అకారణ
+ అరిభిః = కారణము లేకుండా శత్రువులైన (కుకవులైన), దాశైః +
ఇవ = బోయల వలె, సాహంకారం = గర్వముతో, దృప్త
+ నృప = గర్వించిన రాజులనే, అన్ధకూప + కుహరే = పాడుబడిన
బావిలో, క్షిప్తా = పడవేయబడినది. అందువల్ల ఆ వాక్కు, సూక్తి + నిభేన = కావ్యము అనే నెపముతో, తార + కరుణం
= బిగ్గరగా దీనముగా, రోదితి = ఏడ్చుచున్నది.
తాత్పర్యము: అలంకారాలతో, ఉత్తమ
గుణాలతో శోభిల్లే కవి వాక్కు ఒక దివ్యమైన ఆవు (కామధేనువు) వంటిది. ఆశకు లోనైన
కుకవులు, ఆ వాక్కును గర్విష్ఠులైన
రాజుల దగ్గరకు (చీకటి బావిలోకి) తీసుకెళ్లి బంధిస్తున్నారు. ఆ రాజుల స్తుతి
చేస్తున్నప్పుడు, ఆ వాక్కు తన దుస్థితికి కావ్య రూపంలో
దీనముగా రోదిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ముప్పై
నాలుగవ శ్లోకము
ఉష్ణం
నిఃశ్వసితి క్షితిం విలిఖతి ప్రస్తౌతి న ప్రేయసః ప్రీతిం
సూక్తిభిరీశితుః కరతలే ధత్తే కపోలస్థలమ్ । వాగ్దేవీ హృదయజ్వరేణ గురుణా
క్రాన్తా హతాశైర్వృథా నీతావిష్కృతకోపనిష్కృపనృపస్తోత్రత్రపాపాత్రతామ్ ॥ 34 ॥
ప్రతిపదార్థము: హతాశైః = చెడిపోయిన
ఆశలు గల కుకవుల చేత, వృథా = వ్యర్థముగా, ఆవిష్కృత + కోప =
కోపమును ప్రదర్శించునట్టియు, నిష్కృప = దయలేనివారైన, నృప + స్తోత్ర = రాజుల పొగడ్త అనే, త్రపా +
పాత్రతామ్ = సిగ్గుపడవలసిన స్థితికి, నీతా = తీసుకురాబడిన,
వాగ్దేవీ = సరస్వతీ దేవి, గురుణా = గొప్పదైన,
హృదయ + జ్వరేణ = మనోవేదనతో, క్రాన్తా =
ఆక్రమించబడినదై, ఉష్ణం = వేడిగ, నిఃశ్వసితి
= నిట్టూర్చుచున్నది, క్షితిం = నేలను, విలిఖతి = వేలితో గీయుచున్నది, ఈశితుః = తన ప్రభువైన
శివుని యొక్క, సూక్తిభిః = స్తోత్రములతో, ప్రేయసః = అత్యంత ప్రియమైన వస్తువుల యందు, ప్రీతిం =
ఆనందమును, న + ప్రస్తౌతి = ప్రకటించలేకపోతున్నది, కరతలే = అరచేతిలో, కపోలస్థలమ్ = చెంపను, ధత్తే = ఉంచుకొని (చింతిస్తున్నది).
తాత్పర్యము: దయలేని రాజుల
స్తుతికి తనను ఉపయోగించినందుకు వాగ్దేవి మిక్కిలి సిగ్గుపడుతోంది. ఆమె మనోవేదనతో
నిట్టూరుస్తూ, నేల మీద గీతలు గీస్తూ, విచారముతో బుగ్గ మీద చేయి
వేసుకొని కూర్చుంది. తన అసలైన ప్రియుడైన పరమశివుడిని స్తుతించలేకపోతున్నానని ఆమె
ఆవేదన చెందుతోంది.
ముప్పై
ఐదవ శ్లోకము
అస్థానే
గమితా లయం హతధియాం వాగ్దేవతా కల్పతే ధిక్కారాయ పరాభవాయ మహతే తాపాయ
పాపాయ వా । స్థానే తు వ్యయితా సతాం ప్రభవతి ప్రఖ్యాతయే భూతయే చేతోనిర్వృతయే
పరోపకృతయే ప్రాన్తే శివావాప్తయే ॥ 35 ॥
ప్రతిపదార్థము: హతధియాం =
మందబుద్ధి గలవారి యొక్క, వాగ్దేవతా = వాక్కు, అస్థానే =
అపాత్రుని యందు (అయోగ్యమైన చోట), లయం = వ్యర్థముగా, గమితా + చేత్ = వినియోగించబడితే, ధిక్కారాయ = నిందకు,
పరాభవాయ = అవమానమునకు, తాపాయ = మనస్తాపమునకు,
పాపాయ = పాపమునకు, కల్పతే = దారి తీయును. తు =
కానీ, సతాం = సత్కవుల యొక్క వాక్కు, స్థానే
= యోగ్యమైన చోట (శివస్తుతి యందు), వ్యయితా = వినియోగించబడితే,
ప్రఖ్యాతయే = కీర్తికి, భూతయే = ఐశ్వర్యమునకు,
చేతో + నిర్వృతయే = మనశ్శాంతికి, పరోపకృతయే =
పరోపకారమునకు, ప్రాన్తే = అంతమున, శివ
+ అవాప్తయే = మోక్షమునకు (శివ సాయుజ్యమునకు), ప్రభవతి =
సమర్థమగును.
తాత్పర్యము: వాక్కును
అపాత్రులకు ఉపయోగిస్తే నింద, అవమానం, పాపం
కలుగుతాయి. అదే వాక్కును శివస్తుతికి, సత్కార్యాలకు
ఉపయోగిస్తే కీర్తి, సంపద, మనశ్శాంతి
లభించడమే కాక చివరకు మోక్షం కూడా సిద్ధిస్తుంది.
ముప్పై ఆరవ శ్లోకము
(స్తోత్ర ముగింపు)
ఏతాః
పూర్వకవిప్రణీతవివిధగ్రన్థామృతాస్వాదన- క్రీడాదుర్లలితం హరన్తి హృదయం
వాచః కథం ధీమతామ్ । కేషాంచిత్పునరీశ్వరస్తుతిపదవ్యాహారహేవాకినాం యాస్యన్తి
స్పృహణీయతాం భువి భవక్లేశస్పృశాం మాదృశామ్ ॥ 36 ॥
ప్రతిపదార్థము: పూర్వ + కవి =
కాళిదాసు మొదలైన పూర్వ కవులచే, ప్రణీత = రచింపబడిన, వివిధ
+ గ్రన్థ + అమృత = రకరకములైన గ్రంథములనే అమృతమును, ఆస్వాదన =
రుచి చూచుట అనే, క్రీడా = విలాసము నందు, దుర్లలితం = అలవాటు పడిన (నిత్యము అభ్యాసము కలిగిన), ధీమతామ్ = పండితుల యొక్క, హృదయం = హృదయమును, ఏతాః = ఈ నా యొక్క, వాచః = వాక్కులు (కవిత్వము),
కథం = ఏ విధముగా, హరన్తి = ఆకట్టుకోగలవు?,
పునః = కానీ, భువి = ఈ భూమిపై, భవ + క్లేశ + స్పృశాం = సంసార దుఃఖములను అనుభవించుచున్నట్టియు, ఈశ్వర + స్తుతి + పద + వ్యాహార + హేవాకినాం = శివుని స్తుతించు పదములను
ఉచ్చరించుట యందు మిక్కిలి ఆసక్తి కలిగినట్టియు, మాదృశామ్ =
నా వంటి, కేషాంచిత్ = కొందరు పుణ్యాత్ములకు (మాత్రమే),
స్పృహణీయతామ్ = ఇష్టమైనవిగా (కోరదగినవిగా), యాస్యన్తి
= అగును.
తాత్పర్యము: కాళిదాసు, భవభూతి వంటి
మహాకవుల అమృత కావ్యాలను చదివి ఆస్వాదించడం అలవాటుగా ఉన్న పండితులకు, నా ఈ సామాన్య వాక్కులు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ, సంసార
తాపంతో అలమటిస్తూ, ఆ బాధల నుండి విముక్తి కోసం నిరంతరం
"శివ శివ" అని పరమేశ్వరుని స్తుతించడమే పరమావధిగా భావించే నా వంటి
భక్తులకు మాత్రం, ఈ నా కవిత్వము తప్పక ఇష్టమైనదిగా, ఆదరణీయమైనదిగా ఉంటుంది.
విశేషములు మరియు
ఉపసంహారము
- వినయము: కవి తన కవిత్వాన్ని పూర్వ మహాకవుల
కవిత్వంతో పోల్చుకుంటూ తన వినయాన్ని చాటుకున్నారు.
- లక్ష్యము: తన కావ్యం పాండిత్య ప్రకర్ష కోసం కాదని, కేవలం శివభక్తి
మరియు భవబంధ విముక్తి కోసమేనని కవి స్పష్టం చేశారు.
- సంశ్కృత వ్యాఖ్యాత రత్నకంఠుడు ఒక చక్కని మాట చెప్పారు—
"శివుని ఉద్దేశించి మాట్లాడేవాడు సామాన్య భాషలో మాట్లాడినా అతడే ధన్యుడు;
శివుని తలవని వాడు ఎన్ని శాస్త్రాలు రచించినా అది
వ్యర్థమే."
మంగళం: ఇట్లు రాజానక
రత్నకంఠుని 'లఘుపంచిక' అనే వ్యాఖ్యానంతో కూడిన, కాశ్మీర మహాకవి జగద్ధర భట్ట (భట్టనారాయణ) విరచిత స్తుతి కుసుమాంజలి
లోని ఐదవదైన 'కవికావ్యప్రశంసా స్తోత్రము' సంపూర్ణము.

No comments:
Post a Comment